ఆంధ్రన్యూస్ : విజయవాడ. అమరావతిని అభివృద్ధి చేసుకుని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుందామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. రాష్ట్రం గంజాయి వనంగా మారాలంటే మీ ఇష్టం వచ్చిన పార్టీకి ఓటు వేయవచ్చునని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ కాలనీవాసులతో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆదివారం ఉదయం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు, ఎంపిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ (చిన్ని)కి సైకిల్ గుర్తుపై ఓట్లు వే సి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. చంద్రబాబునాయుడు హాయంలో చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటుగా వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టం, ప్రజలకు చేసిన మోసాల గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో వైఎస్.వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి చంపారని, కాని వైఎస్. జగన్మోహన్రెడ్డికి చెందిన టీవీలో మొదటిగా గుండెపోటుతో చనిపోయారని, తర్వాత రక్తం కక్కుకుని చనిపోయారని ప్రసారం చేశారన్నారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత సంఘటన ప్రాంతానికి వచ్చి పరిశీలించిన తర్వాత గొడ్డలితో నరికి చంపారని బహిర్గతం చేశారని అప్పుడే గొడ్డలితో నరికి చంపారన్నారు. అప్పటి వరకు వైఎస్. వివేకానందరెడ్డి మరణంపై జగన్రెడ్డి టి. వి. ఎందుకు తప్పుగా ప్రసారం చేసిందో తెలియడం లేదన్నారు. కోడి కత్తితో దాడి చేయించుకుని డ్రామాలు ఆడటం వల్లనే సానుభూతి పొంది 151 అసెంబ్లీ సీట్లు పొందారన్నారు. నిన్న సింగ్నగర్లో జగన్పై గులకరాయితో దాడి చేశారని చెప్పుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పర్యటన చేస్తున్నప్పుడు విద్యుత్ ఎలా కట్ అవుతుందన్నారు. రౌడియిజాన్ని అణిచివేసిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రౌడీలను అణిచివేయడం వల్లనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడులు ప్రజల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారే కాని కుళ్ళు రాజకీయాలను వారు చేయలేదన్నారు. చంద్రబాబునాయుడు పాలనలోనే ఎయిమ్స్ను కేంద్ర సహాకారంతో మన రాష్ట్రంలో ఏర్పాటు చేశామని, ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్రెడ్డి అలాంటి ఒక్క ప్రాజెకును కూడా కేంద్రం నుంచి ఎందుకు ఏర్పాటు చేయించలేకపోయారన్నారు. అమరావతి అభివృద్ధిని చేసుకోవాలంటే సైకిల్కు ఓటు వేయాలని, గంజాయి వనంలో ఉండాలంటే మరో పార్టీకి ఓటు వేసుకోవచ్చునని అన్నారు.
గులకరాయితో ప్రమాదమా…
గతంలో నారా చంద్రబాబునాయుడు యాత్ర చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చంద్రబాబునాయుడిపై రాళ్ళ దాడికి పాల్పడిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గులకరాయితో చంద్రబాబునాయుడే దాడి చేయించుకున్నారని చెప్పారన్నారు. గులకరాయితో కొడితే చంద్రబాబునాయుడు పావురమా, పిట్ట గులకరాయి తగిలి చనిపోవడానికి అని కొడాలి నాని హాస్యస్పదంగా మాట్లాడారని గుర్తుచేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్రెడ్డిపై ఆకతాయి చిన్న రాయి విసిరితే వైఎస్సార్సీపీ శ్రేణులు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నాయని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడిపై రాళ్ళతో దాడి జరిగినప్పుడు ఇలాంటి చిన్న పాటి సంఘటనలు యాదృశ్చికంగా జరుగుతుంటాయని అప్పటి డీజీపీ వ్యాఖ్యానించారన్నారు. జగన్మోహన్రెడ్డిపై వైజాగ్ ఎయిర్పోర్టులో కోడి కత్తి కేసులో ముద్దాయి ఐదు సంవత్సరాల జైలులోనే కాలం గడిపారన్నారు. జగన్మోహన్రెడ్డి కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెపితే కోడికత్తి శ్రీను ఎప్పుడు బయటకు వచ్చేవాడన్నారు. జగన్మోహన్రెడ్డి కోర్టుకు హజరు కాకుండా ఐదు సంవత్సరాలు కాలం వెళ్ళదీశాడన్నారు. శనివారం జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర సందర్భంగా కూడా పలుమార్లు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంపై కూడా కొన్ని అనుమానాలు తలెత్తున్నాయని చెప్పారు. బొప్పన భవకుమార్ మాట్లాడుతూ ఒక సారి ఎంపీగా, రెండు సార్లు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండు వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను గద్దె రామమోహన్ చేశారని, కాని ఏ రోజు ఇదంతా నేనే చేశానని గద్దె రామమోహన్ చెప్పుకోలేదన్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న 10, 20 లక్షల రూపాయలతో చిన్ని రోడ్డు వేసి తానే ఈ రోడ్డు వేశానని నాకే ఓట్లు వేయాలని అవినాష్ అడుగుతున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని అన్నారు. కార్పోరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గద్దె రామమోహన్ ను మూడో సారి ఎమ్మెల్యేగా, కేశినేని శివనాథ్ చిన్నిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. బీజేపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ అవినీతి, అరాచక వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపాలన్నారు. 33 వేల మంది మహిళలు అదృశ్యమన్నారని, యువత తీవ్రమైన నిరాశలో ఉన్నారన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కాలనీ అధ్యక్షుడు పాతూరి సాంబశివరావు మాట్లాడుతూ వచ్చే నెలలో జరిగే ఎన్నికలు మన రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అని అన్నారు. అందువల్ల ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రోజు వారి ఓటు హక్కును వినియోగించుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు, ముమ్మనేని ప్రసాద్, అడపా నాగేంద్ర, జాస్తి సతీష్, భాస్కర్ పలువురు కాలనీ పెద్దలు, తెలుగుదేశం, జనసే, బి.జె.పి శ్రేణులు పాల్గొన్నారు.