ఆంధ్రన్యూస్ : కాకినాడ జిల్లాలో పర్యవరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా, ఇప్పటికే ఉన్న పరిశ్రమల కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా వెల్లడించారు. రొయ్యల హేచరీల కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యావరణ హిత కార్యాచరణతో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో సోమవారం తునిలో సాయి వేదిక ఫంక్షన్ హాల్లో ఆలిండియా ష్రింప్స్ హేచరీస్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రి దాడిశెట్టి రాజాకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో చూస్తే 1994లో 30, 40 హేచరీల నుంచి ప్రస్థానం ప్రారంభమై నేడు తుని కోస్టల్ ప్రాంతం 250కు పైగా హేచరీలతో వర్ధిల్లుతోందని.. 25 వేల మందికి ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు. స్థానిక యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ రంగం దోహదం చేస్తోందన్నారు. నాణ్యమైన రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తున్న ఘనత ఈ ప్రాంతానికి ఉందని వివరించారు. ఇలాంటి రంగాన్ని కంటికి రెప్పలా చూసుకుంటానని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు వల్ల రొయ్యల హేచరీలకు ఎదురయ్యే సమస్యలను హేచరీల యాజమాన్యాలు తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి వివరించినట్లు తెలిపారు. రెండు దశాబ్దాల నుంచి పారిశ్రామిక తద్వారా ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న హేచరీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారన్నారు. బల్క్ డ్రగ్ పార్కు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అవుట్లెట్ పాయింట్ ఏర్పాటు చేసి, పైపులైన్ల ద్వారా వివిధ వ్యర్థాలను ఆ పాయింట్కు చేర్చి.. ఆపై పర్యావరణహిత విధానాలను అనుసరిస్తూ సముద్రంలో రెండున్నర కిలోమీటర్ల ఆవల విడుదలచేయనున్నామని.. ఇందుకు అవసరమైన అనుమతుల సాధనకు కృషిచేయనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు 35 కి.మీ. వరకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు వచ్చినట్లు మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. ఈ చర్యల వల్ల రొయ్యల హేచరీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. మరింత ఆధునిక విధానాలను జోడిస్తూ హేచరీల పరిశ్రమ మున్ముందు మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. రొయ్యల హేచరీల అభివృద్ధికి ఎక్కడాలేని విధంగా ఇక్కడి సముద్ర తీరం అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ అంటే తనకు మొదట్నుంచి ఇష్టమని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో ఆలిండియా ష్రింప్స్ హేచరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.రవికుమార్, కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ వీర్రెడ్డి, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ ప్రిన్సిపల్ కోటేశ్వరరావు, కాకినాడ జిల్లా మత్స్య శాఖ అధికారి పీవీ సత్యనారాయణ, ఎంపెడా అధికారి ఆనంద్ గోపాల్, వివిధ హేచరీల యజమానులు తదితరులు పాల్గొన్నారు
బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు చర్యలు
RELATED ARTICLES