
శివాలయం ఆవరణలో రాచకొండ ఆంజనేయమూర్తి విగ్రహావిష్కరణ
!రావికమతం: ఆంధ్రన్యూస్
రావికమతం శివాలయం వ్యవస్థాపకుడు స్వర్గీయ శ్రీ రాచకొండ ఆంజనేయ మూర్తి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ మూర్తి విగ్రహాన్ని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి భారీ ఊరేగింపుగా శివాలయ ఆవరణలో ఆయన కొరకు ఏర్పాటు చేసిన ఆలయం వద్దకు తీసుకువచ్చి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. గ్రామ పెద్దలు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముక్కా మహాలక్ష్మి నాయుడు, రావికమతం సర్పంచ్ గెంజి మోది నాయుడు, రావికమతం ఎంపీటీసీ వేపాడ నాగేశ్వరరావు, జనసేన నాయకులు గెంజి శ్రీనివాస్ (నెట్ శ్రీను), తలాట సూరిబాబు, మరియు గ్రామ ప్రజలు అందరూ అత్యంత వైభవంగా గ్రామ వీధులలో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మండల కేంద్రంలో శివాలయ నిర్మాణం కొరకు అహర్నిశలు కష్టపడి పనిచేసిన వ్యక్తి రాచకొండ ఆంజనేయమూర్తి అని కొనియాడారు .అలాగే ఈ గుడి నిర్మాణానికి,అభివృద్ధి కొరకు రాత్రింబవళ్లు కష్టపడి అనేకమంది ప్రోత్సాహంతో నిర్మాణాన్ని పూర్తి చేసి మండల కేంద్రంలోని అతిపెద్ద ఆలయంగా పేరు ప్రఖ్యాతలు పొందే విధంగా అభివృద్ధి బాటలో నడిపించిన వ్యక్తి రాచకొండ ఆంజనేయమూర్తి అన్నారు. అదే ఆవరణలో దుర్గమ్మ, అయ్యప్ప, కుమారస్వామి, శనీశ్వరుడు, నవగ్రహాలు, సూర్యనారాయణమూర్తి తదితర వాటిని ఏర్పాటు చేశారన్నారు. ఈ ప్రాంతానికి ఇదే పెద్ద ఆలయంగా నేడు నిలిచింది అన్నారు. ఆంజనేయ మూర్తి కుటుంబ సభ్యులైన ఆయన సోదరుడు లక్ష్మీనారాయణ ఈ విగ్రహ ప్రతిష్టకు ఎంతో కృషిచేసి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని పలువురు వక్తలు కొనియాడారు.



