
ఆంధ్రన్యూస్: మండపేట. రాష్ట్రంలో మహిళలకు, విద్యార్థినిలకు భద్రత కరువైందని షేక్ అండ్ షేక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా మండిపడ్డారు. ఆడపిల్లలను ఇంటి నుంచి బయటకు పంపాలంటేనే భయమేస్తుందన్నారు. కడప జిల్లా బద్వేల్ లో ఇంటర్ విద్యార్థిని అత్యాచార ఘటనపై ఆయన స్పందించారు. ఆదివారం విజయలక్ష్మి నగర్లోని వైసీపీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలపై హత్యలు అత్యాచారాలు జరగడం నిత్య కృత్యంగా మారిందన్నారు. కర్నూలు జిల్లా అస్పరి మండలంలో ఇంటర్ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది హత్యకు తెగబడ్డ ఘటన మరువక ముందే కడప జిల్లా బద్వేలు పట్టణంలో మరో విద్యార్థిని ప్రేమోన్మాది కిరాతకానికి బలవ్వడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హోం శాఖ మంత్రి మహిళగా ఉండి ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకోవడం శోచనీయమన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తాం రక్షణ కల్పిస్తామంటూ ప్రగల్బాలు పలకడం తప్ప ఊడబొడిసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సీఐ తల్లిని కిడ్నాప్ చేసి చంపేసిన సంఘటన కూడా మన రాష్ట్రంలో చోటు చేసు కోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో రోజూ ఏదో ఒక మూల జరుగుతూనే ఉండడం విచారకరం అన్నారు. గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశ చట్టం అమలు చేసి దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్ సృష్టించి మహిళలకు , విద్యార్థినులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందే తప్ప ఎక్కడా శాంతి భద్రతలు కాపాడేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను కార్యకర్తలను విమర్శించడానికి మాత్రమే హోం మంత్రి పదవిని వినియోగిస్తున్నారే తప్ప శాంతి భద్రతల కోసం కాదని విమర్శించారు. ఘటన జరిగి 24 గంటలు కావస్తున్నా బాధిత కుటుంబాన్ని పరామర్శించక పోవడం బాధాకరం అన్నారు. ఈ ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అలాగే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలన్నారు.



