
శంఖవరం: ఆంధ్రన్యూస్: శంఖవరం మండలంలోని సిద్ధివారి పాలెంలో గల సిద్ధి పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్న ఆంధ్రా శబరిమలై అయ్యప్పస్వామివారి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 12 సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రాశబరిమలై ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ భూపతి శ్రీ కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అయ్యప్పస్వామి సన్నిధిలో తొలుతగా స్వామివారిని 18 మెట్ల మీదుగా ఊరేగింంపు
నిర్వహిస్తామన్నారు. ఆలయ వార్షికోత్సవం ఈ నెల 12 సోమవారం స్వామివారి సన్నిధిలో వేద పండితులు వేకువజాము 5 గంటల నుండి హెూమాలు, యజ్ఞాలు, క్రతువులు నిర్వహిస్తారని, 7 గంటలకు ఉష పూజ గావించి, 9 గంటలకు స్వామివారికి ప్రత్యేకాభిషేకాలు నిర్వహిస్తారన్నారు. 11 గంటలకు స్వామివారికి ఊరేగింపు నిర్వహణ, 11.15 గంటలకు స్వామివారిని ఆలయ ఆవరణలో గల కోనేరులో చక్రస్నానం, 11.30 గంటలకు ఎన్నడూ, ఎక్కడా జరుగని రీతిలో స్వామివారికి వెండి బిందెలతో గంగోత్రి స్నానం నిర్వహణ, 12 గంటలకు నవ కలశాభిషేకం గావించి, 12.30 గంటలకు స్వామివారికి మహా నైవేద్యం సమర్పిస్తామన్నారు. అనంతరం 1 గంటకు ఆలయ ఆవరణలో మహా అన్నదాన వితరణ గావించి, స్వామివారి ఆశీర్వచనం అందిస్తారని శ్రీనివాసరావు గురుస్వామి వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు శ్రీనివాసరావు గురుస్వామి తెలిపారు.



