ఆంధ్రన్యూస్ : శంఖవరం మండలం సిద్దివారిపాలెంలోని ఆంద్రా శబరిమలైలో స్వామియే శరణమయ్యప్ప అంటూ నిత్యం శరణు ఘోషతో ప్రతిధ్వనిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మాలధారణ చేసిన భక్తులు సామాన్య భక్తులు నిత్యం అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ఇరుముడులు సమర్పించుకొని దీక్షను పూర్తి చేసుకుంటున్నారు. ఇక్కడకు వచ్చిన భక్తులకు ఆలయ చైర్మన్ కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. బుధవారం సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన 11 మంది అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు సైకిళ్ళపై ఆంద్రా శబరిమలై బయలుదేరి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణం సాగించి స్వాములు అయ్యప్ప సన్నిధిలో ఆలయ చైర్మన్ కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి వారిచే అయ్యప్ప మాల మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు గురుస్వామి మాట్లాడుతూ భక్తులు ఆంద్రాశబరిమలై అయ్యప్పను దర్శించుకుంటే దివ్యానుభూతికి లోనవుతారని, భక్తులు మనసులోని జ్ఞానాన్ని నిండు మనసుతో అర్పించుకొని ఆత్మ నివేదన చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు గురుస్వామి, డేగల వెంకటేష్, ఎర్రంశెట్టి రేవంత్, మాదేపల్లి సత్తిబాబు, బొలిశెట్టి రాంబాబు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.